సాక్ష్యం 26
నిమ్మగడ్డ అంతోని
అవుటపల్లి గ్రామము,
ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
80 సంవత్సరములు
బ్రదర్ తంబి గారు ముందుగా బోమ్మలు
పెయింటింగు చేయుటకు విజయవాడ వచ్చారు. అక్కడ నుండి కేసరపల్లికి వచ్చి, అక్కడ చిన్న ఇల్లు వేసుకున్నారు. ఆ ఇంట్లో కోళ్ళను, కుక్కలను పెంచారు. ఆ తరువాత అవుటపల్లికి దగ్గర వున్న గ్రామాలకు
వెళ్లి ఆడవాళ్ళని వెంట బెట్టుకొని గుడికి రావడం, మొదటి ఆదివారం తప్పకుండా గుడికి తేవడం, వారిని పంపించి రావటం, వారి ఇండ్లలో భోజనం చేయటం జరుగుతుండేవి. కొన్ని రోజులకు తంబి గారు అవుటపల్లికి
వచ్చారు. కల్దిరారో స్వామి ఒక గృహం ఇచ్చారు. ఆ గృహంలోనే వుంటున్నారు. ఆ ఇల్లు నేను కట్టాను. ఇపుడు అక్కడ వున్న ఇల్లు అదే.
వారి ఇంటి దగ్గరే సున్నం ఆడే గానుగ ఉండేది. ఒక రోజు టాపీ మేస్త్రీలు, వడ్రంగి పని వాళ్ళము అక్కడ కూర్చొని మాట్లాడు కుంటున్నాము. తంబి గారు మా దగ్గరికి వచ్చి “ఏయ్ మేస్త్రీలు” అన్నారు. ‘ఏంటి జోజప్ప గారా!’ అన్నాను నేను. “నేను రెండు చెట్ల కొమ్మలను నాటాను. అవి ఎట్లా బ్రతుకుతాయి?” అన్నారు. ‘నీళ్ళు పెట్టండి బ్రతుకుతాయి’ అన్నాను. అవి చిట్టి కీసర చెట్లు. వారు నీళ్ళు పోశారు. బ్రతికినవి. ఇంటి ఎదురుగా ఆ చెట్టు పెట్టారు. కొన్ని రోజులకు ఒకటి చని పోయింది. ఒకటే వుంది. తెలిసిన వాళ్ళు వచ్చి ఆ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షణ చేసి, స్తోత్రం చెప్పుకొని వెళ్తారు. అలా తిరిగిన తరవాతనే గుడిలో వెళ్ళేవారు. కొన్నాళ్ళకు ఆ చెట్టు కూడా చని పోయింది. నాతో ఏమన్నారంటే, “అంతోనీ! ఈ చెట్టు బతికితే నీకు పది రూపాయలు బహుమతి ఇస్తాను” అన్నారు.
ఆయన ఇవ్వనూ లేదు. నేను తీసుకోనూ లేదు. అంతలోనే ఆయన చనిపోయారు. తంబి గారు చనిపోవుటకు మూడు నెలల ముందు ఒకనాడు నా దగ్గరకు వచ్చి “నాకు సమాధి పెట్టె కావాలి” అన్నారు. ‘మరి పెట్టెకు చెక్క ఏదండి?’ అని అడిగాను నేను. “చెక్క నేను తీసుకు వస్తాను” అన్నారు. ‘నాకు డబ్బులిచ్చి చెక్క తీసుకు వస్తే నేనెందుకు చెయ్యను. చెక్క తీసుకురండి’ అన్నాను. ఊర్లో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్లి చెక్క తెచ్చారు. కుటుంబరావు గారు ప్రెసిడెంట్ అప్పుడు. చెక్క తెచ్చిన తరువాత నేనునూ, సాయిబూ మేస్త్రీ ఇద్దరం కలిసి ఒక రోజులోనే పెట్టె చేయటం, పూర్తి చేసాము. పూర్తి అయ్యాక దీన్ని ఏమి చేయాలండి? అన్నాను. “లోపల పెట్టు” అన్నారు. ఆయన ఇంట్లోనే ఒక ప్రక్కన పెట్టాము. అపుడు తంబి గారు గబాలున లేచి ఆ పెట్టెలో పడుకున్నారు. “బాగా వుంది, ఎత్తు, లావు అంతా సరిపోయింది” అన్నారు తంబి గారు. నాకు నవ్వు వచ్చి నవ్వుతూ, ‘ఏంటి తంబిగారా! మీరు బాగానే వున్నారు, లావుగానే వున్నారు, చచ్చిపోవడానికి, నీవు క్షీనించను కూడా లేదు’ అన్నాను. “ఇది ఇంకెవరికో కాదు, ఇది నా కోసమే” అం అన్నారు. “దేవర తల్లి సహాయం వలన నేను వెళ్ళిపోతున్నాను” అని అన్నారు. నేను నవ్వి పరిహాసం చేశాను. చనిపోవుటానికి మూడు నెలలు ముందు పెట్టె చేయమని అడిగారు. ఇక ఆ తర్వాత నేను అటు వెళ్ళలేదు. నేను వడ్రంగి పని చేస్తున్నాను కాబట్టి, ఇక నా పని మీద నేను వెళ్ళిపోయాను.ఒక నాడు అకస్మాత్తుగా తంబి గారు
చని పోయారని కబురు వచ్చింది. హరే!
ఆయనతో ఇప్పుడే
నేను మాట్లాడి వస్తున్నాను. చావడం ఏంటి? అని
నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ
మేము నవ్వుకుంటూ పరాచకా లాడుతూ మాట్లాడుకునే వాళ్ళం. బోయపాటి ఫ్రాన్సిస్ గారింటికి వెళ్ళేటప్పుడు
ఇటు నుండే దారి.
ఇక ఆయన మరణవార్త
తెలియగానే వారింటికి వెళ్ళాను.
బోయపాటి ఫ్రాన్సిస్ గారికి అందరూ
ఆడపిల్లలే. మొగ పిల్లోడు కావాలని ఆశ వుంది. ఏమండీ! మాకు మగపిల్లలు కావాలి అని బోయపాటి బసవయ్య
గారు (మతములో పేరు ఫ్రాన్సిస్) అంటే “ఫ్రాన్సిస్ గారూ! మీరు ఒక కుక్కపిల్లను పెంచండి. ఆ కుక్క పిల్ల పెద్దదైన తర్వాత కడుపు
ఉబ్బి చచ్చిపోతుంది. ఆ దోషం
నీ కొడుకు మీద పోతుంది. అప్పుడు
నీ కొడుకు నీకు దక్కుతాడు అన్నాడు. అట్లాగే చేశారు. కుక్క
పిల్ల చచ్చి పోయింది. బాలాస్వామి
గారు ఇప్పటికీ సుఖంగా వున్న్నారు.
సమాధి పెట్టె చేయించు కున్నప్పుడు,
‘డబ్బులు ఎట్లా ఇస్తావు? నీ
దగ్గర డబ్బు లేదు కదా!’ అన్నాను. “నీ కెందుకు, నువ్వు చెయ్యి” అన్నారు తంబి గారు. పూర్తి అయిన తర్వా,త నేను ఇంట్లో లేనప్పుడు
బియ్యం చెంగులో పోసుకొని వచ్చి, “భాగ్యమ్మా! పట్టు పట్టు” అన్నారు ముసలమ్మతో. ‘ఏంటి జోజప్ప గారూ’ అన్నది ముసలమ్మ. “బియ్యం అమ్మా! డబ్బులు క్రింది బియ్యం ఇస్తాను” అని చాటలో పోసేసి వెళ్లి పోయారు. మేమిద్దరం మాతలాడు తున్నపుడు మామూలుగా
పరిహాసంగానే మాట్లాడుకునే వాళ్ళం. మత సంబంధం కాదు. అలాంటిది
ఏదీ లేదు. వట్టిగానే తమాషాగా మాట్లాడుకునే
వాళ్ళం.
ఒక రోజు మా ఇంటిలో కిరసనాయిలు
దీపం వెలిగించ లేదు. “నేను
కిరసనాయిలు ఇస్తాను రండి” అన్నారు
తంబిగారు . నేను పనిలోనుండి వచ్చే వరకు
సాయంత్రం ఆరు అయ్యింది. చీకటి
పడింది. వెలుతురు లేదు. బయటకు వచ్చి గుమ్మంలో కూర్చున్నాను. ‘సీసా తీసుకెళ్ళు, జోజప్ప గారు మిమ్ములను
రమ్మన్నారు. కిరసనాయిలు లేదని చెప్పాను’
అని ముసలమ్మ చెబితే సీసా తీసుకుని నేను వెళ్ళాను. ఇదిగోనండి, సీసా తీసుకు వచ్చాను, అన్నాను. ఆ సీసాను లోనికి తీసుకు వెళ్లి దాని
నిండా కిరసనాయిలు పోసి, తీసుకొచ్చి
ఇచ్చారు. అది ఇంటికి తీసుకువచ్చి దీపం
వెలిగించు, అప్పుడు వంట చేసుకున్నాం.
పంచ గాయాల విషయం; ఒక శుక్రవారం
సాయం కాలం దివ్యసత్ప్రసాద ఆశీర్వాదము ఉన్నందున మేమందరము గుడికి వెళ్ళాము. జోజప్పగారు నా పక్కనే మోకరించి ప్రార్ధన
చేస్తున్నారు.
నన్ను ఆనుకొని
కూర్చున్నారు.
నా భుజం మీద తుండు
వుంది. కూర్చున్న తరువాత మనిషి. ఒళ్ళు ఇరగ దీసుకుంటున్నాడు. ఒళ్ళు బాధతో అటూ ఇటూ కదుపు తున్నారు. ఏంట్రా ఇట్లు అంటున్నాడు? అని ఆయన వంక చూసాను. చూస్తే, నొసటి మీద బాగా చెమట పట్టింది. అది రక్త చెమట. మంచి రక్తం కాదు. పల్చగా ఉండే రక్తం వచ్చింది. అప్పుడు నా తుండు తీసుకొని తుడుచుకుని
నాకు చూపించాడు.
ఆ తుండు నేను మీద
వేసుకున్న తరువాత దాని మీద ఏ రక్తం మరక లేదు. మామూలు బట్ట అయి పొయింది. రక్తం వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఈ సంగతిని అందరికి చెప్పాను. ‘అది ఫ్రాన్సిస్ వారి యొక్క మహిమ’ అన్నారు తంబి గారు. తలలో నుండి రక్తం రావటము మాత్రమే చూశాను. గుడిలో చూడటమే.
కల్దిరారో స్వామి, జోజప్ప గారిని
ఇష్టముగా చూచే వారు కాదు. కొన్నాళ్ళు
ద్వేషించారు. ‘మేము ఇలాంటి పరిస్థితులలో వుండగా
మీకు రావటం ఏమిటి’
అని కడుపులో ఉద్రేకం
వుంది, కష్టపెట్టారు. కష్ట పెట్టినపుడు తంబిగారు, తేలప్రోలు
వెళ్ళిపోయారు.
అక్కడ ఒక డేరా
వేసుకుని వైద్యం చేశారు. వైద్యం
చేస్తున్నపుడు, నేను అక్కడికి ఒకసారి వెళ్ళాను. ‘ఏంటి జోజప్ప గారా, దేనికొచ్చిన బాధ’ అని అన్నాను. “కాదయ్యా! చెయ్యాలి. దేవుని సముఖమున చేయాలి” అన్నారు. అంటూనే ఒక మనిషిని కడుగు తున్నాడు. వెన్ను పూస మీద వున్న పుండును కడుగు
తున్నారు. అప్పుడు నేను ‘ఈ పుండును బాగు చేసిన వాళ్ళు ఎవరూ కనబడటం
లేదు నీవు కడుగుతున్నావు వేమిటి?’ అన్నాను. తంబి గారు నావంక చూసి నవ్వారు. “నేను వస్తాను” అన్నాడు.
తరువాత నేను అక్కడ
నుండి వచ్చేశాను.
ఆ పుండు నయం చేశారు.
క్లారమ్మగారి మేనత్తకు కాలిపై
పుండు లేచి గాయ మయింది. ఎక్కడ
తిరిగినా నయం కాలేదు. తంబి
గారి దగ్గరకి వచ్చారు. “మీరందరూ
బయటకు వెళ్ళిపొండి.
నేను మందు వేస్తాను” అన్నారు. అని ఆ పుండును నాలుకతో నాకాడు. అప్పుడు అది నయమైంది. ఆమె బయటకి వచ్చి అందరికి చెప్పింది.
తంబిగారిని నేను చేసిన పెట్టెలోనే
పెట్టి సమాధి చేశారు. ఇప్పుడున్న
సమాధిలోనే పెట్టారు. సమాధి
తవ్వి, పక్కలకు గోడలు కట్టి, మూడు నెలలకు తీసి చూడాలని ప్రయత్నంతో
చేసారు. అందుకు గురువులు ఒప్పుకోలేదు. ‘మాకు పాపుగారి దగ్గర నుండి ఆర్డర్ రానిదే
తీయుటకు వీలు లేదు’
అని అన్నారు. ఇప్పటికి కూడా తీసి చూడలేదు.
మా ముసలమ్మ భక్తురాలు. జోజప్ప గారు ఇంటికి వచ్చినప్పుడు, వదిలి పెట్టకుండా, జపం చెప్పించుకునేది. ఇంటికి వచ్చినపుడు భోజనం చేయలేదు. కాని
కూరలో వ్రేళ్ళు పెట్టి నాకి చూసి “బాగుంది, రుచిగావుంది” అనే వారు తంబి గారు. ఆయనకు ఒక కాలు లావుగా ఉండేది. అది బోదకాలు. ఒక విధంగా నడిచేవారు. భూమి మీద సమానంగా నడిచేవారు కాదు. పిచ్చి వాడి లాగా చ్... చ్... చ్... అంటూ వెళ్ళిపోయే వాడు. బెజవాడ నుంచి కేసరపల్లికి వచ్చినపుడు, పిచ్చివాడిలా వెళుతుంటే, పిల్లలందరు రాళ్ళు వేసేవారు. ‘పిచ్చోడు రా! రాళ్ళు వేయకండి’ అన్నారు అక్కడి మాష్టారు
గారు. సాయంకాలం అయినపుడు తంబి గారు
జపదండ చెప్పటం మొదలు పెట్టారు. ‘ఈయన ఎవరో భక్తుడు రా! రాళ్ళు వేయవద్దు’ అని పిల్లలతో చెప్పి, ఆ ఊరి మాష్టారు తంబి గారిని గుడి వద్దకు
తీసుకు వెళ్ళారు.
జపం చెప్పించిన
తరువాత వారింటి వద్దే భోజనం ఏర్పాటు చేశారు ఆ మాష్టారు గారు. ఇక అక్కడే వుండి పోయాడు. అక్కడే వుండి, కోళ్ళు, కుక్కలను పెంచుతూ, ఒక సంసారం లాగా అన్నీ చేశారు. తంబి గారు కూలికి వెళ్ళేవారు కాదు కానీ, పరిగే ఏరుటకు వెళ్ళేవారు. అలా తెచ్చుకున్న గింజలను వండు కొని తినేవారు. అవుటపల్లికి
వచ్చిన
తరువాత ఇక వెళ్ళలేదు.
మొదట్లో తెల్లబట్టలు, లాల్చీ లాగ కుట్టించుకొని వాడే వారు. కొన్ని రోజులు తర్వాత కావి రంగు వస్త్రాలు
కుట్టించాడు. బట్టలు మమూలువే. ఆయన గుడికి వచ్చినపుడు మొదట్లో మామూలు
బట్టలు వాడేవారు.
కొన్నాళ్ళు జరిగి
పోయిన తరువాత పెద్ద గౌను లాంటి నల్ల రంగు వస్త్రం ధరించేవారు. ఆ బట్టలు ధరించినపుడే, స్వాముల వారు
కొంచెం అసూయగా మాట్లాడాడు. కల్దిరారో స్వామి అలా అసూయగా మాట్లాడి నందుకే తంబి గారు తేలప్రోలు వెళ్ళిపోయారు.
అక్కడినుండి మళ్ళీ కల్దిరారో
స్వామియే పిలిపించారు. అప్పుడు
తంబిగారు వచ్చారు.
అలా వచ్చిన తరువాత
ఇప్పుడున్న ఇల్లు కట్టించారు. ఆ ఇంట్లో ఉండమన్నారు. మొదట కట్టినపుడే బెంగుళూరు పెంకుతో కట్టారు. గోడలు అపుడు దిమ్మెలు వేసి, మట్టితో కట్టాము. ఇప్పుడు రాతితో కట్టారు. ఆ ఇంటి ప్రక్కనే వంట శౌరీ ఇల్లుండేది. దానిని ఇప్పుడు తీసేసారు.
No comments:
Post a Comment