Friday, May 15, 2020

సాక్ష్యం 17

సాక్ష్యం 17

పేరు             :         మదాను మెల్కియోర్
వృత్తి             :         రిటైర్డ్ టీచర్
జన్మదినం       :         26 జనవరి 1950
అడ్రస్            :         పెద్దావుటపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

మా తండ్రిగారైన మాదాను శౌరయ్య గారి [అప్పటి విచారణ గురువులు కల్దిరారో గురువులకు వంట మనిషిగా చేసారు] ద్వారా మరియు ఇతర వ్యక్తుల ద్వారా నేను విన్న విషయాలు:

1. అవుటపల్లిలో బోయపాటి క్లారమ్మ గారి నాయనమ్మ కిందపడి కాలు విరిగినప్పుడు, తంబిగారు కాలు మీద స్లీవ గురుతు వేసి ప్రార్ధన చేయగా ఆమె స్వస్థత పొందినది.

2. మానికొండ గ్రామములో గోగినేని పరంధామయ్య గారి భార్య అయిన నాంచారమ్మ గారు చెప్పిన విషయాలు: వారి పెద్ద బిడ్డకు (శచీల) పక్ష వాతం నయం చేసారు. పరంధామయ్య గారిపై లారీ అసోసియేషన్ వారు అసూయతో కేసు వేయగా (డబ్బు కాజేశారు) తానెరుగనని తంబిగారితో విన్నవించుకోగా తంబిగారు నిజం గ్రహించి, జడ్జిగారికి కలలో కనబడి, పరంధామయ్యగారు నిర్దోషి అని తీర్పు చెప్పించారు.

3. మాదాను శౌరయ్య - దావాజీ గూడెం నుండి కాలుపై పుండుతో (రాక్షసి పుండు) (నాలుగు ఇంచుల బారు/లోతు) రాగా తంబి గారు, రాయు పుండును నాలుకతో నాకి, ఆకులతో కట్టు కట్టి, మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఆ వ్యక్తి మూడు రోజుల తరువాత తిరిగి వచ్చినప్పుడు, తంబిగారు అక్కడ లేనందున, కల్దిరారో స్వామి మరియు మాదాను శౌరి కట్టు విప్పి చూడగా మచ్చ మాత్రమే ఉండడం, కళ్ళార వారు చూసారు. ఆనాటి నుండి అంతకు ముందు విశ్వాసం లేని కల్దిరారో స్వామి కూడా తంబి గారిని నమ్మారు.

4. పగాలంతా పిచ్చి వాడిగా తన మహత్యం తెలియ నీయక ప్రవర్తించిన తంబి గారు రాత్రులు, విపరీతముగా, ఎడతెరిపిగా ప్రార్ధన చేస్తుండే వారు. పెద్దగా అరుస్తూ రక్త బిందువులు కారగా, ప్రార్ధన చేస్తుండేవారు. ఎవరితోనో మాట్లాడు తున్నట్లు వుండేవారు. జేసు నాధుని దివ్య దర్శనం, పంచ గాయాలు పొందారని, తంబిగారు గురించి నాన్న చెప్తూ వుండేవారు.

5. ఓ సారి తంబి గారికి పాము కరవగా నురగలు క్రక్కుతూ, దేవాలయంలో ప్రార్ధన చేస్తున్నారట. స్పృహ కోల్పోయి, పడిపోయారట! అందరూ, పాము కరిచింది, తంబిగారు చనిపోతారని అనుకున్నారట! కొంత సేపటికి లేచి మామూలుగా బయటకి వచ్చారట!  దీనిని తుట్టగుంటపాడు మునసబుగా చేసిన గుడిసె రాజా రావు గారు సాక్ష్యం చెప్పుచున్నారు.

6. కల్దిరారో స్వామివారు నడుపుచున్న అసుపత్రికి వచ్చిన రోగులకు తంబిగారు అన్నం పెట్టేవారట. ఉపాధ్యాయులకు కూడా పెట్టేవారట. ఒకసారి, గొట్టుమొక్కల ఆనందు ఇంటికి చాలామంది చుట్టాలొస్తే అన్నం వండారట. చాలామందికి ఈ సోలెడు ఏం సరిపోతాయి అనగా,  వండమన్నారట. తాను వండి ఆరబోయటానికి ఇచ్చారట. ఆనందుకు ఆశ్చర్యం! చాపపై తోడగా, అన్నంతో చాప నిండి పోయిందట. భయంతో ఆనందు బయటకు వచ్చాడట.

ఆనందు T.B. పేషెంటు. ఆయన దగ్గు తగ్గటానికి మూడు ఆకులు ఇచ్చి తినమన్నారట. ఆయన ఆ ఆకులను తినకుండా పార వేశాడు. తంబి గారు గ్రహించి ఆకులు పార వేశావు, నీకు నయం కాదు పొమ్మన్నారట. ఆ వ్యాధితోనే ఆయన చనిపోయాడు.

7. శౌరయ్య ఇంటి వద్ద నారింజ చెట్టు ఉండేది, కాయలు కాచేది. ఓ రోజు తంబి గారు చెట్టెక్కి, కొమ్మ నరుకుతున్నారు. మా నాన్న, తంబిగారి కాలు పట్టి గుంజుతూ, ‘పిచ్చోడా! కాయలు కాసే చెట్టు నరుకుతున్నావుఅని క్రింద పడే సాడట. తంబి గారు,ఆ కొమ్మలో పురుగులున్నాయి, దాని వల్ల చెట్టంతా చచ్చి పోతది” అని చెప్పి ఆ కొమ్మ చీల్చి లోపల నున్న పురుగులు చూపారట.

8. తన మరణం గురించి మూడు నెలల ముందుగానే అనేక మందికి చెప్పారు. అమ్మ శౌరమ్మతో చెప్పిన విషయం: అమ్మను పుట్టింటికి తీసుకొని పోవుటకు ఆనందు రాగా, తంబిగారు, శౌరమ్మ, నీవు వెళ్ళవద్దు, మీ అన్నయ్య పెట్టే బట్టలు నేను పెడతాను” అని చెప్పారు. కాని అమ్మ తంబిగారి మాటలు వినకుండా ప్రయాన మైందట. అప్పుడు తంబిగారు, శౌరమ్మ, నా చావు నీవు చూడలేవు, సరే,” అని పొమ్మన్నాడు. అప్పుడు అమ్మ, తంబిగారు చనిపోరులేఅని అనుకోని అమ్మ పుట్టింటికి వెళ్ళింది. అమ్మ తిరిగి వచ్చి, ఆయన సమాధిని చూసిందట.

9. చివరిగా 6 జనవరి 1945వ సం.లో, మానికొండలో సువార్త ప్రచారం చేస్తుండగా, ఆయనను కర్రలతో కొట్టారు. రక్తం కారుతున్న శరీరంతో అవుటపల్లికి వచ్చి, పడిపోయారు. ఆ మంచం పట్టటం - వారి మరణం జనవరి 15న దారి తీసింది.

10. తేలప్రోలు పండుగకు టీచర్సు వెళ్ళారు. పండుగ అనంతరం, కనుతుల జోజి మాష్టారు గారితో, తంబిగారు, “నన్ను అవుటపల్లి వరకు సైకిలుపై తీసుకొని వెళ్ళు” అని అన్నారట! ఎక్కించుకొని, త్రొక్కలేనని, తంబిగారితో చెప్పకుండా కాలువ గట్టున వస్తున్నాడట. అతను సైకిలులో గాలిపోయి, నడచి వస్తున్నాడట. పొదల బాట నుండి తంబిగారు వచ్చి, నన్నెక్కించు కోకుండా నీవు దొంగగా పారిపోయి వస్తున్నావు కదా! అందుకే సైకిలులో గాలి పోయిందని చెప్పారట. అవుటపల్లి వరకు నడవలేవు, సైకిలెక్కి వెల్లమన్నారట. అప్పుడు జాజి మాష్టారు, ఇదేంటి పిచ్చోడు, సైకిలులో గాలి లేదు కదా! సైకిలెక్కి వెల్లమంటాడు ఏంటి! అని అనుకుంటూ, సైకిలు టైరు వంక చూడగా, దానిలో గాలి ఫుల్లుగా ఉన్నదట! ఇది తంబి గారి మహత్యం!

11. ఓ సారి కల్దిరారో స్వామి గుడిలో జపం చేస్తుండగా, తంబి గారు గుడి కిటికీలు, వేస్తూ తీస్తూ శబ్దం చేస్తున్నారట! స్వామికి కోపం వచ్చి కర్రతో కొట్టి దూరంగా పార వేసారట. ఆ కర్ర పామై, స్వామి మీదకు వచ్చింది. స్వామి భయపడి ‘పాము, పాము’ అని అరవగా, తంబి గారు వెళ్లి, పట్టుకొని, “పాము కాదు స్వామి, కర్ర” అని కర్రను చూపారట. స్వామికి కర్ర పాములా కనబడటం ఎంత ఆలోచించినా అంతు బట్టలేదట!

12. ఓ సారి తంబి గారికి పంచ గాయాలు వచ్చినప్పుడు, కాకుమాను బాలయ్య ఎద్దేవచేయగా, తంబిగారు అతనితో, గాయాలలో వ్రేలు పెట్టి చూడమన్నారట. చూసి పంచ గాయాలే అని ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నాడు.

13. అదృశ్య గమనం - అనుకున్న చోటకు వెళ్లడం - ఓ సారి బోయపాటి ఫ్రాన్సిస్ గారు చెప్తుండగా విన్నాను. తాను ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఓ అదృశ్య హస్తం, తన చొక్కా కాలరు పట్టి లేపి, అనుకున్న చోట దింపుతుంది అని. ఇదిది వట్లూరు మరియు మానికొండలో జరిగింది.

 మదాను మెల్కియోర్,   పెద్దావుటపల్లి

మదాను మెల్కియోర్

No comments:

Post a Comment