Wednesday, July 8, 2020

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యుడు

అధ్యాయము 02
పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యుడు


జోసఫ్ తంబి
దైవ సేవకుడు
కేరళ రాష్ట్రములోని వేరాపొలిమేత్రాసణములోని కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములో జోసఫ్‌ తంబి ఉపదేశిగా తన సేవను అందించుచున్న సమయములోనే, కార్మలైట్‌ మిషనరీ ద్వారా క్లొల్లం’ (‘కోయిలోన్‌’) అను ప్రదేశానికి, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీల ఆగమనం గురించి జోసఫ్‌ తంబిగారు తెలుసుకొని యున్నారు. జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ పౌరసత్వమును కలిగి యుండటము వలన, అలాగే ఫ్రెంచ్‌ భాషకూడా బాగా వచ్చియుండుట వలన, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను కలుసుకొనుటకు ఆసక్తిని చూపారు.

ఈవిధంగా, జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను క్లొల్లంఅను ప్రదేశములో కలుసుకొని, వారితో కొంత కాలము గడిపియున్నారు. కపూచిన్‌ సభలో చేరి మఠసభ సభ్యునిగా అగుటకు నిర్ణయించుకున్నారు.

ఆ కాలములో కపూచిన్‌ సభలో చేరిన ఆరంభములోనే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి తృతీయ సభకు చెందిన అంగీని ఇచ్చెడివారు. ఆవిధముగనే, జోసఫ్‌ తంబి క్రీ.శ. 1931/1932వ సంవత్సరములో క్లొల్లంలోని కపూచిన్‌ మఠములో చేరి తృతీయ సభకు చెందిన అంగీని స్వీకరించారు.

ఆరంభ తర్ఫీదు అనంతరం, కపూచిన్‌ మఠవాసులు జోసఫ్‌ తంబిగారిని తరువాతి తర్ఫీదునకు తీసుకొనుటకు నిరాకరించారు. దీనికి ముఖ్య కారణం, జోసఫ్‌ తంబి కుడికాలు బోదకాలు అగుటవలన, అలాగే తరుచూ భక్తి భావోద్రేకములకు లోనై మూర్చవ్యాధి లక్షణములను కలిగియుండుట వలన, మఠమును వీడి వెళ్ళవసి వచ్చినది.

మఠమును వీడినప్పటికిని తృతీయ సభఅంగీని ధరించే అనుమతి ఉండెడిది. ఈవిధముగా, జోసఫ్‌ తంబి కపూచిన్‌ సభ మఠమును వీడినప్పటికిని, స్థానిక మేత్రాణు అనుమతితో తృతీయ సభ అంగీని ధరించియున్నారు. కపూచిన్‌ మిషనరీలతో కొద్దికాలము సహవాసము తరువాత, జోసఫ్‌ తంబిగారు క్రీ.శ. 1933వ సంవత్సరములో కపూచిన్‌ సభ మఠమును వీడి యున్నారు.

కపూచిన్‌ సభ మఠమును వీడిన తరువాత, అనేక సార్లు స్వస్థమైన పాండిచ్చేరిని సందర్శించాడు. అచ్చటి గ్రామాలను, దేవాలయాలను సందర్శిస్తూ, ప్రజలకు అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారు స్థాపించిన తృతీయ సభను గురించి తెలియజేశాడు. అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి జీవితమును ఆదర్శముగా తీసుకొని, తాను ఎక్కడికి వెళ్ళినను తృతీయ సభను గూర్చి తెలియజేస్తూ, సభ సంఘాలను, శాఖలను ఏర్పాటు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించారు.

స్వస్థలములో తన బంధువులు తనను గుర్తించిన తరువాత, తాను సందర్శించినప్పుడు, వారి కోరిక మేరకు వారి గృహాలో కొన్ని రోజుపాటు ఉండేవాడు. వారితో పాటే భుజించేవాడు, ప్రార్ధించేవాడు.

ఉదాహరణకు, జోసఫ్‌ తంబిగారు పాండిచ్చేరిలో చాలా దగ్గరి బంధువైన జోసఫ్‌ తంబివారి ఇంటిని అనేకసార్లు సందర్శించారు. పాండిచ్చేరి వెళ్ళినప్పుడల్ల, వీరి ఇంటిలో ఉండెడివారు. ఆ యింటి ఇల్లాలు క్రైస్తవ భక్తిపరురాలు. జోసఫ్‌ తంబిగారిని భక్తిభావముతో ఆహ్వానించి ఆతిధ్యమును ఇచ్చెడిది. వారు కలిసినపుడెల్ల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకునెడివారు. ప్రార్ధనలు చేసెడివారు. చుట్టుప్రక్కల వారుకూడా ఈ ప్రార్ధనలో పాల్గొనెడివారు.

పునీత అస్సేసి పుర ఫ్రాన్సిస్ 
ఈవిధముగా, తను ఎక్కడికి వెళ్ళినను ఫ్రాన్సిస్‌ వారి తృతీయ సభను వ్యాప్తిచేయుటకు ప్రయత్నం చేసారు. పాండిచ్చేరిలో ప్రజలు జోసఫ్‌ తంబిగారిని ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు. ప్రేమగా ఆయనను ‘‘తంబి’’ (చిన్న సోదరుడు) అని పిలిచేవారు.

No comments:

Post a Comment